షూటింగ్ అయిపోగానే పేద ఆర్టిస్టుల జేబులో డబ్బు పెట్టి పంపేవారు: రాళ్లపల్లి గురించి అలీ

  • రంజాన్ ఉపవాసం ముగించుకుని వెళ్లేసరికి అంతా అయిపోయింది
  • విగతజీవుడిగా చూడాల్సి వచ్చింది
  • ఎంతోమందికి సాయం చేసేవారు
ప్రముఖ నటుడు రాళ్లపల్లి మృతి పట్ల హాస్యనటుడు అలీ స్పందించారు. రంజాన్ నెల ఉపవాసం ముగించుకున్న తర్వాత ఆసుపత్రికి వెళ్లి రాళ్లపల్లి గారిని చూసొద్దాం అని బయల్దేరి వెళితే అక్కడ ఆయన భౌతికకాయం కనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లపల్లి గారికి ఆరోగ్యం బాగాలేదన్న విషయం తనకు శుక్రవారమే తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా రాళ్లపల్లి గురించి ఇతరులకు తెలియని కొన్ని విషయాలు అలీ మీడియాతో పంచుకున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ చెన్నైలో ఉన్న సమయంలో షూటింగ్ ప్యాకప్ చెప్పగానే, పేద ఆర్టిస్టులు ఎవరైనా సెట్స్ మీద ఉంటే వాళ్ల జేబులో ఎంతో కొంత డబ్బు పెట్టి పంపించేవారని గుర్తుచేసుకున్నారు.

ఆగస్టు 15న రాళ్లపల్లి పుట్టినరోజు అని, అయితే ఏనాడూ తన జన్మదిన వేడుకలు జరుపుకోని ఆయన, ఆ వేడుకలకు అయ్య ఖర్చును ఎవరైనా కష్టాల్లో ఉన్న కళాకారులకు అందజేసేవారని వెల్లడించారు. కొన్నిరోజుల క్రితం కూడా  కాకినాడలో సీనియర్ గాయకుడు బాబ్జీ తీవ్ర కష్టాల్లో ఉన్నాడని తెలిసి రాళ్లపల్లి చలించిపోయారని, వెంటనే తనవంతుగా సాయం చేశారని వివరించారు.

అంతేకాకుండా, సీనియర్ నటుడు పద్మనాభం పరిస్థితి బాగాలేకపోతే డబ్బు సాయం చేసి ఆపై తనకు ఫోన్ చేసి చెప్పారని అలీ పేర్కొన్నారు. నువ్వూ ఎంతోకొంత ఇవ్వు, మరో నలుగురికి చెప్పి సాయం చేయించు అంటూ తనతో చెప్పారని వివరించారు. ఆయన మాట ప్రకారం ఫిలించాంబర్ లో ఓ కార్యక్రమం ఏర్పాటు చేసి పద్మనాభం గారికి సన్మానం చేసి రూ.5 లక్షలు ఇచ్చినట్టు వెల్లడించారు.
Go Back to Shorts
Rallapalli
Ali

More Telugu News